పంజా విసురుతున్న కరోనా.. దేశంలో 169కి పెరిగిన కేసులు
- తాజాగా చండీగఢ్ లో మరో కేసు నమోదు
- మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్న వైరస్ ప్రభావం
- ఎయిర్ పోర్టుల్లో లక్షల మందికి స్క్రీనింగ్
దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి మెల్లమెల్లగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. గురువారం మధ్యాహ్నం సమయానికి దేశవ్యాప్తంగా 169 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్యసంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ముగ్గురు మరణించగా.. మరో 15 మంది వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జి అయినట్టు తెలిపింది. మిగతా 151 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించింది.